ప్రైవేటు స్కూల్ బస్సు ప్రమాదం... తృటిలో తప్పిన భారీ ప్రమాదం




 


డ్రైనేజీలోకి ఒరిగిన మంగళకర స్కూల్ బస్సు.. సురక్షితంగా బయటపడిన విద్యార్థులు


గోరంట్ల, జూలై 29:

గోరంట్ల సమీపంలో ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న డ్రైనేజీలోకి ఒరిగిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న ముగ్గురు విద్యార్థులు, డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.


పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పుట్టపర్తి మండలం జగరాజుపల్లి కేంద్రంగా నడుస్తున్న మంగళకర స్కూల్ బస్సు ప్రతిరోజూ గోరంట్ల పరిసర గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తోంది. బుధవారం ఉదయం ఖాజాపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రహదారి పక్కనున్న డ్రైనేజీలోకి దూసుకెళ్లి ఒక వైపునకు ఒరిగిపోయింది.


ఆ సమయంలో బస్సులో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉండటంతో వారందరూ స్వల్ప భయాందోళనకు గురైనా, ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ కూడా క్షేమంగా బయటపడినట్లు సమాచారం.


డ్రైవర్ నిర్లక్ష్యం లేదా అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


అదృష్టవశాత్తు బస్సులో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే తీవ్ర విషాదం చోటుచేసుకునేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.