బీజేపీలో చేరిన వైసీపీ నేత పోలేపల్లి మాధవ్ కుమార్

2014–2021 వరకు గుంతకల్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా సేవలు

వ్యక్తిగత కారణాలతో కొంతకాలం రాజకీయాలకు దూరం

ప్రధాని మోదీ పనితీరుకు ఆకర్షితుడై బీజేపీలో చేరిక

అనంతపురం, ఆగస్టు 8: గుంతకల్లు పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పోలేపల్లి మాధవ్ కుమార్ అలియాస్ మధు భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం అనంతపురంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా పోలేపల్లి మాధవ్ కుమార్ మాట్లాడుతూ.. 2014 నుంచి 2021 వరకు గుంతకల్లు మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా పనిచేయడంతో పాటు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగినట్లు తెలిపారు. అనంతరం వ్యక్తిగత కారణాలతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు.

గత కొంతకాలంగా రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నానని మాధవ్ కుమార్ తెలిపారు. దేశ హితం, సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి తనను ఆకర్షించిందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న తీరు తనను బీజేపీ వైపు ఆకర్షించిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని, అందులో భాగంగా శనివారం అనంతపురంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో పార్టీలో చేరినట్లు వెల్లడించారు.

 ఇకపై గుంతకల్లు నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి, పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మాధవ్ కుమార్ తెలిపారు. పార్టీ నాయకత్వం అప్పగించే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.