నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేటు పాఠశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయని వైయస్సార్ విద్యార్థి విభాగం ఆరోపించింది. ఉరవకొండ నియోజకవర్గంలోని పలు విద్యాసంస్థలు కేవలం ఒకే అనుమతి పత్రంతో రెండు వేర్వేరు పాఠశాలలను నడుపుతూ విద్యాశాఖను పక్కదారి పట్టిస్తున్నాయని ఆ సంఘం నాయకులు సంచలన ఆరోపణలు చేశారు.
ఈ మేరకు సోమవారం అనంతపురం కలెక్టరేట్లో జరిగిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో, జిల్లా రెవెన్యూ అధికారి మల్లోలకు విద్యార్థి విభాగం ఉరవకొండ నియోజకవర్గ అధ్యక్షులు సాకే పురుషోత్తం నేతృత్వంలో ఫిర్యాదు అందజేశారు
అనుమతుల గోల్మాల్: ఒకే అనుమతితో రెండు పాఠశాలలు నిర్వహించడం, ఎటువంటి అనుమతులు లేకుండానే అదనపు భవనాల నిర్మాణాలు చేపట్టడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఫీజుల దోపిడీ: టెక్నో, ఐఐటి, ఒలింపియాడ్ వంటి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వేలాది రూపాయల ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అధికారుల పాత్ర: కనీస మౌలిక సదుపాయాలు లేకపోయినా, అధికారుల అండతో సదరు పాఠశాలలకు ఏటా రెన్యువల్ పర్మిషన్లు ఇప్పిస్తున్నారని ఆరోపించారు.
ఈ అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులైన పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు సాకే ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.
