విడపనకల్లు
రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని మట్టి లోడుతో వెళ్తున్న ఓ టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టి, పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డొనేకల్లు నుంచి చెరువు మట్టిని గడేకల్లు గ్రామానికి చెందిన రైతులు తమ పొలాల్లోకి తరలించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్.. గడేకల్లు నుండి విడపనకల్లు వెళ్లే రహదారిపైకి రాగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. అదుపు తప్పిన వాహనం రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని (పోల్) బలంగా ఢీకొట్టింది.
ఢీకొట్టిన వేగానికి టిప్పర్ పూర్తిగా రోడ్డు పక్కన ఉన్న లోతట్టు పొలాల్లోకి పడిపోయింది. లారీలోని నల్లమట్టి అంతా పొలంలో కుప్పగా పడిపోయింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినప్పటికీ, లారీ పొలాల్లో పడిపోయిన సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానిక రైతులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని డ్రైవర్ను క్యాబిన్ నుంచి సురక్షితంగా బయటకు తీశారు. డ్రైవర్కు కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి.



