ఉరవకొండ:
మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్లకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా కార్యక్రమం శనివారం రెండవ రోజుకు చేరుకుంది. పిల్లల్లో ఎదుగుదల లోపాలను ముందస్తుగానే గుర్తించేందుకు ఉద్దేశించిన 'AI, (ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్) స్క్రీనింగ్' శిక్షణలో ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీమతి డాక్టర్ B.N. శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీడీపీఓ శ్రీదేవి మాట్లాడుతూ, పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో మైలురాళ్లను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పిల్లల్లో ఏవైనా లోపాలు ఉంటే అవి తీవ్రం కాకముందే, ప్రాథమిక దశలోనే *నవచేతన’ యాప్ ద్వారా స్క్రీనింగ్ చేసి గుర్తించవచ్చని అంగన్వాడీ వర్కర్లకు వివరించారు. ఈ యాప్ వినియోగం మరియు స్క్రీనింగ్ విధానంపై వారికి అవగాహన కల్పించారు.
చిన్నారి ప్రాయంలోనే లోపాలను గుర్తిస్తే సకాలంలో వైద్యం, తగిన జాగ్రత్తలతో వాటిని సరిదిద్దవచ్చని, కాబట్టి వర్కర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి ఈ స్క్రీనింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓ డాక్టర్ బి.ఎన్. శ్రీదేవితో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్లు అరుణమ్మ, రాజేశ్వరి మరియు మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు (వర్కర్లు) పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

