ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్లో కలకలం - ఇద్దరు విద్యార్థినుల మెడపై అనుమానాస్పద గాట్లు
విడపనకల్: అనంతపురం జిల్లా, విడపనకల్ మండలం, ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో ఉన్న ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్లో గురువారం అర్ధరాత్రి జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
హాస్టల్లోని ఒకే గదిలో ఉంటున్న నలుగురు ఇంటర్ విద్యార్థినుల్లో ఇద్దరి మెడపై గుర్తు తెలియని గాట్లు కనిపించడంతో విద్యార్థినులు భయంతో వణికిపోయారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో వింత శబ్దాలు రావడంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు గదుల నుండి బయటకు పరుగులు తీశారు.
ఈ ఘటనపై తల్లిదండ్రులు, విద్యార్థినులు చేస్తున్న తీవ్రమైన ఆరోపణలు ఇవే:
1. ఘటనను గోప్యంగా ఉంచేందుకు యత్నం: రాత్రి 2 గంటలకు జరిగిన ఘటన గురించి మరుసటి రోజు సాయంత్రం వరకు తల్లిదండ్రులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. యాజమాన్యం విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేసిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2. గాయపడిన విద్యార్థినిని రహస్యంగా ఇంటికి పంపివేత: గాయపడిన విద్యార్థినుల్లో ఒకరిని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, వైద్య పరీక్షలు కూడా చేయించకుండా హుటాహుటిన ఇంటికి పంపించేశారు. దీనివెనుక ఏం జరిగిందో దాచే కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
3. రాత్రి భద్రత గాలికి: సుమారు 130 మంది బాలికలు ఉంటున్న హాస్టల్లో రాత్రిపూట కనీస భద్రతా సిబ్బంది, వార్డెన్, గస్తీ లేదు. ఇన్చార్జి వార్డెన్ కూడా హాస్టల్లో ఉండరు. బయటి వ్యక్తులు సులభంగా ప్రవేశించే పరిస్థితి ఉందని విద్యార్థినులు వాపోతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. తమకు ఎలాంటి సంబంధం లేదని సిబ్బంది చేతులు దులుపుకోవడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు.
ఒకవేళ ఆ గాట్లు ప్రమాదకరంగా మారి ఉంటే బాధ్యత ఎవరిది? మా పిల్లల ప్రాణాలకు హామీ ఏముంది? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
గత కొద్ది రోజుల క్రితమే గాగులపాడు గురుకుల పాఠశాలలో విద్యార్థి పాముకాటుకు గురైన ఘటన మరువకముందే ఇలాంటి ఘటన జరగడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం.
పేరులో మాత్రమే ఆదర్శ పాఠశాలలు, నిజ జీవితంలో మచ్చుకైనా ఆదర్శం కనిపించడం లేదు. విద్యాధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, హాస్టల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలపై నోరు మెదపాల్సిన విద్యార్థి సంఘాలు మామూళ్ల వసూళ్లపై చూపిస్తున్న శ్రద్ధ సమస్యలపై చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.



