మచిలీపట్నం, మే 18: మచిలీపట్నంలో మైనర్ బాలికపై అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఈ ఘటన చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఈ విషయాన్ని వెల్లడించిన అబ్దుల్ నబీ ప్రకారం, ఈ నెల 13వ తేదీన 13 సంవత్సరాల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి పరిస్థితిని ఆసరాగా తీసుకుని బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. పై అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం వేగంగా విచారణ చేపట్టింది..
సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు జుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా పోలీసులు బాలల భద్రతపై ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. మైనర్ బాలికలు, మహిళలపై వేధింపులు, అసభ్య ప్రవర్తన లేదా లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా అత్యవసర సేవల నంబర్ 112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
బాలల భద్రత విషయంలో రాజీ ఉండదని, ప్రతి ఫిర్యాదును సీరియస్గా తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

