మంగళగిరి:
కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికే కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “ప్రజాదర్బార్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితుల సమస్యలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించిన ఆయన.. ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అర్జీదారుల సమస్యలకు త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కారం చూపేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామని ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

